మడకశిరరూరల్: ప్రస్తుత ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు మాసంలో వర్షం పడితే రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ చాన్స్లర్) డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆమిదాలగొంది పంచాయతీలో పర్యటించారు. రైతులు సాలు పద్ధతిలో సాగు చేసిన కంది, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవడంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు మాసంలో వర్షాలు పడితే రైతులు కంది, పెసర, కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. జూన్ మాసంలో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు బెట్టకు గురి కాకుండా పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ పంటలను రక్షించుకోవాలన్నారు. నీటి పొదుపు పద్ధతులు, వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు చేసుకోవాలన్నారు. కందిలో తల్లి సాలు తీయడం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండడంతో తేమ ఎక్కువ రోజులు పంట ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు సుమతి, విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఇయర్స్ డాక్టర్ సంపత్ కుమార్, నంద్యాల పరిశోధన సంచాలకులు విజయలక్ష్మి, ఏఓ తిమ్మప్ప, వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ


