మడకశిర: మండలంలో మంగళవారం ఓ విద్యార్థి అదృశ్యం ఘటన కలకలం సృష్టించింది. గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. మండలంలోని కే. కొత్తపాళ్యం గ్రామానికి చెందిన అజిత్ 3వ తరగతి చదువుతున్నాడు. రోజూ విద్యార్థి కొత్తపాళ్యం నుంచి పీఎస్ తండాలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. మంగళవారం విద్యార్థి అజిత్ అవ్వ తమ పిల్లాడిని స్కూల్ దగ్గర వదలమంటూ గ్రామంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంలో ఎక్కించింది. అయితే విద్యార్థిని స్కూల్ దగ్గర దించకుండా ద్విచక్ర వాహనదారుడు మరిచిపోయి కదిరేపల్లి క్రాస్కు వెళ్లాడు. ఇప్పుడెలా అని అజిత్ను ద్విచక్రవాహన దారుడు అడగ్గా.. సమీపంలోని కేకాతిలో తమ బంధువులు ఉన్నారని, బస్సు చార్జీకి డబ్బులిస్తే అక్కడికి వెళతానని చెప్పడంతో డబ్బులిచ్చి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే విద్యార్థి తప్పిపోయాడంటూ పీఎస్ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రూరల్ సీఐ రాజ్కుమార్, ఎస్ఐ కృష్ణారెడ్డి స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అజిత్ కేకాతి గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ రాజ్కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


