● వేటకొడవలితో దాడి చేసిన టీడీపీ కార్యకర్త
చిలమత్తూరు: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మహేంద్రరెడ్డిపై ఆదివారం రాత్రి గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో హత్యాయత్నం జరిగింది. డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలన్న డిమాండ్తో ఆదివారం మండలకేంద్రమైన గోరంట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహేంద్రరెడ్డి వెళ్లారు. ర్యాలీ అనంతరం మహేంద్రరెడ్డి బంధువుల గ్రామమైన రెడ్డిచెరువుపల్లి చెరువుకు వెళ్లాడు. అక్కడ ర్యాలీ జరిగిన తీరును వివరిస్తుండగా...అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త నరసింహమూర్తి జీర్ణించుకోలేక మహేంద్రరెడ్డిని దూషించాడు. మాటామాటా పెరగడంతో సమీపంలో ఉన్న కొడవలి తీసుకుని మహేంద్రరెడ్డి తలపై, వీపుపై ఇష్టారీతిన దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. అంతకుముందు హిందూపురం ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి మహేంద్రరెడ్డిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వేణురెడ్డి వెంట వైఎస్సార్సీపీ జోన్–5 వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్కుమార్రెడ్డి, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంజన్రెడ్డి, దామోదర్రెడ్డి, గజేంద్రరెడ్డి, మహేంద్రరెడ్డి, విష్ణు శంకర్, చందు తదితరులు ఉన్నారు.


