పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనేది ఒకప్పటి నానుడి. ఆర్టీసీలో ప్రయాణం ఆందోళనకరం, నరకప్రాయం అనేది ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న మాట. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ సీ్త్ర శక్తి పథకం తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణానికి తగినన్ని బస్సులను అందించడంలో మాత్రం విఫలమైంది. దీంతో బస్సుల్లో రోజురోజుకు రద్దీ పెరిగిపోతూ ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. చెయ్యెత్తినా ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు ఆపడం లేదు. ఒకవేళ ఆపినా కస్సుబుస్సులాడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కడ పడితే అక్కడ దించేస్తూ..
బస్సుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన బస్స్టాప్లో బస్సులు ఆపడం లేదు. ఎక్కడో దూరంగా ఆపి ప్రయాణికులను దించేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ప్రయాణికులు రద్దీ దృష్ట్యా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గొడవలు.. దాడులు
పలు రూట్లలో రద్దీకి అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో ఉన్న బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు దాడులు చోటుచేసుకుంటుఉన్నాయి. ప్రయాణికులకు సర్దిచెప్పడం, వారిని అదుపు చేయడం ఆర్టీసీ సిబ్బందికి కత్తిమీద సాములా మారుతోంది.
చెయ్యెత్తినా బస్సు ఆపని ఆర్టీసీ డ్రైవర్లు
వెనకే మరో బస్సు వస్తోందంటూ
కండక్టర్ల ఉచిత సలహాలు
రద్దీకి అనుగుణంగా బస్సులు
నడపకపోవడంతోనే ఈ తిప్పలు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
సర్వత్రా విమర్శలు
వెనుక బస్సు ఖాళీ.. అందులో రండి!
జిల్లా వ్యాప్తంగా పలు రూట్లలో 278 ఆర్టీసీ బస్సులు నడుపుడుతున్నారు. పుట్టపర్తి–అనంతపురం, ధర్మవరం–అనంతపురం మార్గంలో ప్రతి గంటకు ఒక బస్సు నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి బస్సు రద్దీగా వస్తుండడంతో చుక్కలు కనబడుతున్నాయి. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్తచెరువు, ధర్మవరంలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో చెయ్యి ఎత్తి బస్సు ఆపాలని కోరితే వెనకాలే మరో బస్సు వస్తోందంటూ బస్సు డ్రైవర్, కండక్టర్ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వెనుక వచ్చే బస్సులు కూడా రద్దీగా ఉండడం, ఆ బస్సు సిబ్బంది కూడా వెనుక బస్సులొస్తున్నాయంటూ సెలవిస్తుండడంతో ప్రయాణికులకు దిక్కు తోచడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలా రూట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


