● వీబీజీ రామ్జీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్
లేపాక్షి: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంత రైతులు చెరువుల్లో సామూహికంగా పశు గ్రాసం పెంచుకోవాలని వీబీజీ రామ్జీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం మండలంలోని పులమతి చెరువులో సామూహిక పశుగ్రాస పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరా నుంచి 5 ఎకరాల వరకు రెండు సంవత్సరాలకు కలిపి ఎకరాకు రూ. 56 వేల విలువ చేసే గ్రాసం పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బ్రహ్మదేవ్ మాట్లాడుతూ చెరువుల్లో పశుగ్రాస పెంపకానికి ఉచితంగా గడ్డి జొన్నలు సరఫరా చేస్తామన్నారు. 75 శాతం సబ్సిడీతో అన్ని పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం డివిజన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పెంచలయ్య, ఏపీడీ శివానందనాయక్, ఏడీలు సోమనాథ్, డాక్టర్లు కిషోర్, జయశ్రీ, సుబ్బరాయుడు, నీరజ తదితరులు పాల్గొన్నారు.


