హిందూపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న సీపీఐ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సీపీఐ ఆధ్వర్యంలో ‘‘మార్పు కావాలి.. మార్పు రావాలి’’ అనే నినాదంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ కాలనీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రహమత్పురం సర్కిల్ మీదుగా గన్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం గన్ సర్కిల్లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి హిందూపురం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శులు ఇస్మాయిల్, మారుతిరెడ్డి, సీనియర్ నాయకుడు డి.బాబు, ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ భాష, మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాబీర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి తదితరులు పాల్గొన్నారు.


