రామగిరి: ‘రెండేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూసి చూపించాం.. రాప్తాడు రూపురేఖలు మార్చేశాం’ అంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత గొప్పలు చెప్పుకుంటుండగా... సొంత పంచాయతీ నసనకోటవాసులు మాత్రం ‘‘సాల్లే సంబడం’’ అంటూ పెదవి విరుస్తున్నారు. నెలరోజులుగా నసనకోటలో వీధిలైట్లు వెలగక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగిశాక గ్రామంలోని వీధిలైట్లు విడతల వారీగా మాడిపోయాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు ఉన్నా, వీధిలైట్ల గురించి పట్టించుకునే తీరిక వారికి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్రామంలోని వీధిలైట్లు చాలా వరకూ కాలిపోయాయి. దీంతో సాయంత్రం తర్వాత నసనకోట వాసులంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రివేళ బయటకాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కూతవేటు దూరంలోని వెంకటాపురంలోనే ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నా... తమ బాధలు ఆమెకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సమీపంలోని సోలార్ప్లాంట్లో పనిచేసేందుకు చత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారని, రాత్రి వేళల్లో వారి సంచారంతో భయపడిపోతున్నామని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నసనకోటలో వీధిలైట్లు వెలిగేలా చూడాలని ఆ గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే సునీత సొంత పంచాయతీలో వెలగని వీధి లైట్లు


