ముదిగుబ్బ: జిల్లాలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్నినోను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని యాకర్లకుంటపల్లిలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ కంది, ఉలవ, అలసంద, పెసర, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడం శ్రేయస్కరమన్నారు. పంటలు బెట్ట పరిస్థితుల్లో ఉంటే పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఈ–పంట నమోదుతో పాటు పంటల బీమాను చేయించుకోవాలన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి జయకుమార్బాబు మాట్లాడుతూ అవకాశమున్న రైతులు నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ఉత్తమమన్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్పు పద్ధతులను ఉపయోగించి సాగునీటిని ఆదా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఏడీఏ సనావుల్లా, ఏఓ రవీంద్ర, వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


