పుట్టపర్తి అర్బన్: సమస్యలతో కూడిన, అవాంఛిత గర్భాన్ని తొలగించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) సేవల నిమిత్తం జిల్లాలో 17 ఆసుపత్రులకు ఆమోదం తెలిపినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం తెలిపారు. బుధవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంటీపీ కమిటీ, జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 17 ప్రైవేటు ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా కమిటీ పరిశీలించి అనుమతిచ్చిందన్నారు. కమిటీలో ఓ గైనకాలజిస్ట్, ఓ పీడీయాట్రీషన్, ఓ ఫిజీషియన్తో పాటు కదిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ సభ్యులుగా ఉన్నారన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని (పీసీపీఎన్డీటీ) కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి ప్రజల్లో చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ కళాధర్, డిప్యూటీ డెమో సుబ్రమణ్యం, డిప్యూటీ హెచ్ఓ రామలక్ష్మి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.


