గద్దైపె పూజా కార్యక్రమాలను తిలకిస్తున్న భక్తులు
ప్రత్యేక అలంకరణలో అక్కమ్మ దేవతల విగ్రహాలు
పుట్టపర్తి అర్బన్: ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని ఏడాదికి ఒక్కసారి జరిగే సప్త మాతృకల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీ పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం చౌటవంకలో కొలువై ఉన్న సప్తమాతృక అక్కమహా దేవతల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమంతో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 7 మంది అక్కమహాదేవతల మూల విరాట్టులకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. వెండి, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేసి పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలకు పూజలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దైపె కుంకాలు చెరిగారు. తర్వాత వారికి చేటలు ఇచ్చి అందులో పూజా సామగ్రిని ఉంచి కుంకాలు చెరిగే కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎడ్ల బండ్లు ఊరేగించారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు.
చౌటవంకకు పోటెత్తిన భక్తులు


