లేపాక్షి: మండలంలోని నాగేపల్లి సమీపంలోని నీటి వంకలో ఆదివారం పురుషుని పుర్రె లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థఽలానికి చేరుకుని పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన పుర్రెను ఫోరెనిక్స్ పరీక్షల కోసం పంపించామని, డీఎన్ఏలో వచ్చిన ఆధారాల బట్టి అది ఎవరిదనే విషయం తెలుస్తుందని ఎస్ఐ పేర్కొన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మహిళ మెడలో
బంగారు చైన్ అపహరణ
రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లిలో శనివారం అర్ధరాత్రి అశ్వర్థమ్మ అనే మహిళ మెడలోని నగలను దొంగలు అపహరించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో అశ్వర్థమ్మ బహిర్బూమికి వెళ్లింది. ఈ సమయంలోనే దుండగులు ఆమె మెడలోని తాళిబొట్టు చైన్ను లాక్కెళ్లారు. చైన్ సుమారు మూడు తులాల ఉంటుందని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ సమీపం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసుల వివరాల మేరకు... తిమ్మాపురం గ్రామానికి చెందిన నడిపి వెంకటేష్ (50) మేకలు మేపుకొంటు జీవనం సాగించేవాడు. ఆదివారం తెల్లవారుజామున మేక పిల్లల మేత కోసం రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా తిమ్మాపురం క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికిభార్య లక్ష్మిదేవి, కుమారులు మురళి, నరసింహమూర్తి ఉన్నారు.
పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
జిల్లా వాసి మృతి
మదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. తలుపుల మండలం సిద్ధ గురుపల్లికి చెందిన వీరాంజనేయులు (33) బి.కొత్తకోటలో భార్య మల్లీశ్వరితో కలిసి కాపురం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాల డైరీలో పనిచేస్తున్న వీరాంజనేయులు శనివారం రాత్రి పీటీఎం రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బి. కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


