రాయదుర్గం రూరల్: మండల పరిధిలోని 74 ఉడేగోళం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిదురు బొమ్మయ్య కుమారుడు బి.ఓబయ్య (38) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు ఓబయ్య గ్రామంలో నుంచి సబ్స్టేషన్ వెనుక భాగాన ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనం బయలుదేరాడు. అయితే హైవేపై రోడ్డు దాటుతుండగా రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 39జడ్ 0704) ఢీ కొంది. స్థానికులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఓబయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడన్నారు. మృతుడికి భార్య సూరమ్మ, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్లొస్తానని చెప్పి , తిరిగరాని లోకాలకు వెళ్లావా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నేను దుర్మార్గుడినే
● ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదలను
● జేసీ ప్రభాకర్రెడ్డి బరితెగింపు
తాడిపత్రిటౌన్: నేను దుర్మార్గుడినే..దుష్టుడినే ఏమన్నా అనుకోండి.. ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, లీగల్సెల్ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే తాడిపత్రి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన 24 మంది పేర్లు చదువుతూ వారిలో ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేతిరెడ్డికి నాకు మాత్రమే ఫైట్ అని, ఇది టీడీపీ, వైఎస్సార్సీపీ సమస్య కాదన్నారు. వైఎస్సార్సీపీలోని ఆ 24 మంది వచ్చే స్థానిక ఎన్నికల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఈనెల 6న తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట 24 మంది వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
మహిళపై అత్యాచారయత్నం
యల్లనూరు: మండల పరిధిలోని జంగంపల్లిలో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. ఏఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాలమేరకు... ఏఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. జంగంపల్లికి చెందిన సురేష్ భార్య లింగుట్ల జ్యోతి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి కాంపౌండులో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన తాయన్న ... జ్యోతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో తాయన్న పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాయన్నపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.


