పుట్టపర్తి: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలి. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి , జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒకవైపు చెబుతూనే... మరోవైపు వెన్నుపోటు పొడుస్తోందని మండి పడ్డారు. ఇటీవల జరిగిన మంత్రుల చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదన్నారు. పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు 29 శాతం మధ్యంతర భృతి, పెండింగ్లో ఉన్న 5 డీఏల చెల్లింపు, సంపాదిత సెలవుల మంజూరు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ఏడాది బదిలీ అయిన కొందరు ఉపాధ్యాయులు రిలీవర్లు లేక పాతస్థానాల్లోనే కొనసాగుతున్నారని చెప్పారు. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వాలన్నారు. కేంద్రంతో చర్చించి విద్యాహక్కు చట్టం 23 (1)కి సవరణ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, సహాధ్యక్షుడు బాబు, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లు తాహిర్వళి, మహంతేశ్వర్, జిల్లా కార్యదర్శులు అమర్ నారాయణరెడ్డి, నరసింహప్ప, మురళీ, మల్లిఖార్జున, రవివర్ధన్రెడ్డి, చెన్నకేశవులు, బాబు, జిల్లా పూర్వపు కార్యదర్శి సుధాకర్, యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, నారాయణస్వామి, భాస్కరయ్య, పాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు
యూటీఎఫ్ నాయకుల హెచ్చరిక


