పుట్టపర్తి: ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో తమ ఎత్తుగడలు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నాడన్న కారణంతో వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్ఏ సుదర్శన్పై, అతని కుటుంబ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన కొత్తచెరువులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...‘సర్’ కార్యక్రమం ప్రారంభం నుంచి చురుగ్గా ఉన్న వైఎస్సార్సీపీ బీఎల్ఏ సుదర్శన్ టీడీపీ వర్గీయుల కుయుక్తులకు అడ్డుపడుతూ వచ్చాడు. దీంతో అతన్ని ఎలాగైనా నియంత్రించాలనుకుని టీడీపీ కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలోనే సుదర్శన్ ఇంటి సమీపంలో ఉన్న మల్లిగంగాద్రి, తులశమ్మల పెంపుడు కుక్క అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. అయితే సుదర్శన్ కుటుంబమే కుక్కను చంపిందని ఆరోపిస్తూ శుక్రవారం సుదర్శన్ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలైన మల్లి గంగాద్రి, తులశమ్మ, వారి కుమారులు హేమంత్, గణేష్, గణేష్ భార్య దండగల అరుణ, మరో ఇద్దరు ఎరుకల నాగమణి, అనూషబాయి తదితరులు సుదర్శన్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. సుదర్శన్తో పాటు అతని తండ్రి జయరాం, భార్యను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. స్థానికులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా సర్ది చెప్పారు. తీవ్ర గాయాలపాలైన సుదర్శన్ కుటుంబ సభ్యులు కొత్తచెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇంతలోనే టీడీపీ కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి ముందుగానే పోలీస్ స్టేషన్కు వెళ్లి సుదర్శన్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయించారు.
దాడి చేసి మాపైనే కేసులు
తనతో పాటు కుటుంబీకులపై దాడి చేసి రక్త గాయాలు చేసిన టీడీపీ నాయకులే తిరిగి తమపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సుదర్శన్ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దుద్దుకుంట శ్రీధర్రెడ్డి శనివారం సుదర్శన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యులకూ రక్త గాయాలు
బాధితులపైనే కేసు నమోదు చేయించిన టీడీపీ నేతలు


