‘పది’ పరీక్షల నిర్వహణలో ‘ప్రైవేట్’ భాగస్వామ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఈసారి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లుగా ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. పరీక్షల నిర్వహణలో నూతన ఒరవడికి విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల నుంచి 75 శాతం మందిని తీసుకుంటే, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల నుంచి 25 శాతం మందిని తీసుకోనున్నారు. అలాగే తొలిసారిగా అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకం ప్రక్రియ ఎస్ఎస్ఈ బోర్డు నుంచే చేపట్టనున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ఆధారంగా హెచ్ఎంలు, టీచర్ల జాబితా తయారు చేసి మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డీఈఓలకు పంపారు. వారు ఆ జాబితాలను పరిశీలించి ప్రతి టీచరుకూ సంబంధించి రిమార్కులు రాసి పంపాలి. నిబంధనల మేరకు అనర్హులైన వారిని తొలిగించి.. అర్హులైన వారిని విధుల్లో నియమిస్తారు. ఈ విషయాలను వెబెక్స్లో విద్యాశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. 60 ఏళ్లు నిండిన వారికి, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మినహాయింపు ఇస్తారు. అయితే వీరు సంబంధిత మెడికల్ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వారు సిఫార్సు చేస్తే డీఈఓ ద్వారా బోర్డుకు వెళ్తాయి. అక్కడి నుంచి మినహాయింపు ఇస్తారు. చార్జెస్ ఫ్రేమ్ అయిన వారు, ఇతర క్రమశిక్షణ చర్యలకు పాల్పడిన వారిని పరీక్షల నిర్వహణ విధులకు తీసుకోరు. ఉన్నతాధికారులు వెబెక్స్లో తెలియజేశారని పూర్తిస్థాయి విధివిధానాలు రెండుమూడు రోజుల్లో రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది.
నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ కమిషనర్
ప్రభుత్వ పాఠశాలల నుంచి 75 శాతం, ప్రైవేట్ నుంచి 25 శాతం
రాష్ట్రస్థాయిలోనే సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకాలు
‘టిస్’ ఆధారంగా వివరాలు తీసుకున్న విద్యాశాఖ
ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు సీనియార్టీ జాబితాలు
వారి నుంచి రిమార్కులు కోరనున్న విద్యాశాఖ
మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ వార్షిక పరీక్షలు


