ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం: ఎస్పీ
పరిగి: ఇసుక అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎస్పీ సతీష్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పరిగి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం మండలంలోని పైడేటి, శాసనకోట నదీ పరివాహక ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న చిన్నపల్లి క్రాస్, ధనాపురం క్రాస్, హొన్నంపల్లిలను పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను పరిశీలించి ఇసుక అక్రమ రవాణా కట్టడి, ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఐ రాఘవన్, ఎస్ఐ రంగడుయాదవ్తో చర్చించారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ మీడియాతో మాట్లాడారు. పరిగి మండలంలోని పైడేటి, శ్రీరంగరాజుపల్లి, శాసనకోట తదితర నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తామన్నారు. ఇటీవల పరిగి మండలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు యువకులు వీలింగ్ చేసుకుంటూ హైస్పీడ్తో ద్విచక్రవాహనాలను నడుపుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ తగాదాలను పరిష్కరించేందుకు ఐసీడీఎస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేసేలా కలెక్టర్తో చర్చిస్తామన్నారు. రౌడీలు, గుండాలను ఉపేక్షించేది లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తున్నామన్నారు.


