రైతుకు అండగా నిలుద్దాం
ప్రశాంతి నిలయం: రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర వాటిని సకాలంలో అందిస్తూ అండగా నిలుద్దామని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన జిల్లాలో పక్కాగా అమలు కావాలన్నారు. అర్హులకు పథకం అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇక మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేసే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు ముందుగానే అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతూ సూక్ష్మ పోషకాలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణకుమార్, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శోభారాణి, పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, సహకార శాఖ అధికారి కృష్ణానాయక్, మార్క్ఫెడ్ మేనేజర్ గీతమ్మ, నీటి పారుదల శాఖ అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలి
పౌరసేవలను వేగవంతం చేయడంతో పాటు వివిధ సమస్యలపై అందే అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందిన ఫిర్యాదులు, ఇళ్ల నిర్మాణాలు, పీఎం సూర్యఘర్, ప్రజా సానుకూల అభిప్రాయం, స్వర్ణ పంచాయతీ, తాగునీటి సరఫరా, ఓపెన్ స్కూల్, అక్షర ఆంధ్రా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి పథకాన్నీ గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు. వీసీలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సీడీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆదేశం
పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై సమీక్ష


