తాట తీస్తామంటూ బెదిరింపులు
● హిందూపురానికి చెందిన వైఎస్సార్సీపీ బీసీ నాయకుడు ప్రశాంత్ గౌడ్పై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఎకై ్సజ్ సీఐను దూషించారనే సాకుతో బలవంతంగా తప్పుడు ఫిర్యాదు చేయించారు. చంద్రబాబు సర్కారు జనాలను ఏ విధంగా వేధిస్తోందో చెప్పడానికి వారిద్దరి మధ్య జరిగిన ఆడియో కాల్ సంభాషణే నిదర్శనం.
● పుట్టపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్నపై అర్బన్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వివాదాలకు దూరంగా ఉండే తిప్పన్నపై టీడీపీ నేతలు బలవంతంగా ఓ దళితుడి ద్వారా ఫిర్యాదు చేయించి కేసు పెట్టించడం సర్కారు దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారం ఉందనే అహంకారంతో పోలీసులను పావులుగా వాడుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అరాచకం మొదలైంది. తప్పును తప్పుగా చూపితే బెదిరిస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారులతోనే తప్పుడు ఫిర్యాదులు చేయించి.. బాధితులపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో సామాన్యులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. హిందూపురం, కొత్తచెరువు, పుట్టపర్తి, కదిరిలో వరుసగా వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. వార్తలు రాసే విలేకరులపైనా తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు మోపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. కేసులు నమోదు చేయడంతో పాటు టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. రాజకీయంగా ఎదగనీయకుండా బీసీ, ఎస్సీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అక్రమ కేసుల్లో ఇరికించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.
హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఈ నెల 15న కొందరు టీడీపీ గూండాలు దాడి చేసి ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగులగొట్టారు. వైఎస్సార్, కనకదాస, అంబేడ్కర్ చిత్రపటాలను బయట పడేశారు. ఏసీలు విసిరేశారు. అడ్డుకోబోయిన వారిపై తిరగబడ్డారు. అయితే ఇంతటి పెద్ద ఘటనలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. కనీసం ధ్వంసమైన కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించేందుకు కూడా అవకాశం కల్పించలేదు. అంతేకాకుండా ధ్వంసం చేస్తున్న వారిని అడ్డుకోబోయిన వారిపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారు.
బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నాసిరకం పనులు చేసి నిధులు స్వాహా చేశారనే కోణంలో కథనాలు రాశారనే అక్కసుతో.. విలేకరులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. గుర్తు తెలియని వ్యక్తితో ఇద్దరు విలేకరులపై ఫిర్యాదు చేయించడం అధికార పార్టీ నేతల దిగజారు రాజకీయాలకు పరాకాష్ట. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఒత్తిళ్లతో పోలీసులు ఎలాంటి విచారణా చేయలేదు. అంతేకాకుండా ఓ విలేకరిని చితకబాదారు.
తమ నాయకులపై వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తామంటూ టీడీపీకి చెందిన కొందరు ప్రెస్మీట్లు పెట్టి మరీ బెదిరిస్తున్నారు. కొత్తచెరువుకు చెందిన కిలారి శ్రీనాథ్, పుట్టపర్తిలో అంబులెన్స్ రమేష్, హిందూపురంలో యుగంధర్ (చింటు)తో పాటు ఇటీవల కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కూడా విలేకరులపై చిందులు వేశారు. వ్యతిరేక వార్తలు రాస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
అధికార మదంతో అక్రమ కేసుల బనాయింపు
అధికారులను పావులుగా వాడుకుంటున్న వైనం
తప్పుడు ఫిర్యాదులు చేయించి.. కేసుల నమోదు
హిందూపురంలో ఆగని కూటమి నేతల వేధింపులు
పుట్టపర్తి, రామగిరి, కదిరిలో మారని ‘తమ్ముళ్ల’ తీరు
వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తామని బెదిరింపులు
విలేకరులపైనా అక్రమ కేసులు
దాడి చేసిన వారిని వదిలేసి..


