
దౌర్జన్యంగా కూల్చేశారు
రొద్దం: హైకోర్టు పరిధిలో నడుస్తున్న స్థల వివాదంలోని షెడ్డును పోలీసులను అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారంటూ రొద్దం మండలం ఎల్జీబీనగర్ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు ఈడిగ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2021లో తన భార్య ఈడిగ రమాదేవి పేరున సర్వే నంబర్ 311లో ఇంటి స్థలానికి పట్టా ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని 2016 నుంచి అందులో నివాసముంటున్నామన్నారు. ఈ క్రమంలో షెడ్డును తొలగించాలంటూ అధికారిక ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో దీనిపై హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గురువారం ఉదయం ఉన్నఫళంగా పెద్ద సంఖ్యలో పోలీసులను వెంటబెట్టుకొచ్చిన రెవెన్యూ అధికారులు.. జేసీబీ సాయంతో షెడ్డును నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన తన భార్య రమాదేవిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. విషయం తెలుసుకున్న స్తానిక వైఎస్సార్ నాయకులు ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఎల్జీబీనగర్ మారుతీరెడ్డి, ప్రసాదరెడ్డి, తదితరులు బాధితుడిని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత రాజారెడ్డి తెలిపారు.
అది రోడ్డు పొరంబోకు స్థలం : తహసీల్దార్
కూల్చివేతపై తహసీల్దార్ ఉదయశంకరరాజు మాట్లాడుతూ.. పెనుకొండ – పావగడ ప్రధాన మార్గంలోని రోడ్డు పోరం బోకు స్థలంలో రేకుల షెడ్డును నిర్మించుకున్నట్లుగా గుర్తించామన్నారు. వారికి పట్టా ఇచ్చింది ఓ చోట అయితే మరో చోట రేకుల షెడ్డును నిర్మించుకున్నారని వివరించారు. ఈ స్థలంపై హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందన్నారు. దీంతో ఇంటి పట్టాను జాయింట్ కలెక్టర్ రద్దు చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో రోడ్డు పోరం బోకు స్థలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్డును తొలగించినట్లుగా పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ మద్దతుదారుడి ఆవేదన