తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌   - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత ముమ్మాటికీ సంతానానిదేనని, దీన్ని ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో ‘వయోవృద్ధులు, తల్లిదండ్రుల నిర్వహణ, పోషణ చట్టం–2007’పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చట్టంలో పొందు పరచిన హక్కుల గురించి అందరూ అవగాహన చేసుకోవాలన్నారు. వయోవృద్ధుల చట్టం సీనియర్‌ సిటిజన్లకు రక్షణ కల్పించడంతో పాటు హక్కులను కాపాడుతుందన్నారు. అలాగే వైద్య సదుపాయం అందేలా చూడటంతో పాటు వారి ఆస్తులకు కూడా రక్షణకల్పిస్తుందన్నారు. ప్రభుత్వం కూడా ఏ ఆధారమూ లేని నిరుపేద వృద్ధుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విలువలతో, క్రమశిక్షణతో పెంచాలని, అప్పుడే వారు పెద్దవారైన తర్వాత వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బాగా చూసుకుంటారన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు అబ్దుల్‌ రసూల్‌, ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వృద్ధులు పాల్గొన్నారు.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top