● స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
● చేజర్ల సమీక్షలో మాజీ ఎమ్మెల్యే
మేకపాటి విక్రమ్రెడ్డి
చేజర్ల: కష్టకాలంలో నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి విక్రమ్రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శ్రేణులను సిద్ధం చేసేందుకు శుక్రవారం మండలంలోని బోడిపాడులోని మండల కన్వీనర్ మాలకొండారెడ్డి నివాసం వద్ద జరిగిన సమీక్షలో విక్రమ్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల వారీగా మండల పార్టీ ఆధ్వర్యంలో సమీక్షలు జరిపి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి నమ్మకద్రోహం చేసిన విషయంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్, ప్రతి పంచాయతీలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి సిద్ధం చేయాలని మండల నాయకులకు సూచించారు.
కార్యకర్తలకు సముచిత స్థానం
పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పించి సమన్యాయం దిశగా చర్యలు తీసుకుంటామని విక్రమ్రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. రానున్న కాలంలో చేజర్ల మండలంలో వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా ఎదగాలని తెలియజేశారు. మండల స్థాయి నేతలు గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులకు కేంద్ర కార్యాలయం అందించిన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి, పార్టీ అధ్యక్షుడు బోయిళ్ల మాలకొండారెడ్డి, నాయకులు బాలిరెడ్డి సుధాకర్రెడ్డి, పూనూర్ రామ్మనోహర్రెడ్డి, నోటి సుందరరామిరెడ్డి, గోతం వెంకటసుబ్బయ్య యాదవ్, పోలంరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఉగ్గుముడి రఘురామిరెడ్డి, గంగవరం కృష్ణారెడ్డి, బోరిగర్ల రామచంద్రయ్య, మదమంచి వెంకటరత్నం నాయుడు, మాలపాటి పెంచల్రెడ్డి, పల్లంరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, గుడిపాటి ప్రభాకర్ నాయుడు, పాలకొండ వెంకటరత్నారెడ్డి, ఒంటేరు సుధీర్కుమార్రెడ్డి, పంచేటి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


