● జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
● డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలివేశారు’ అని డీవైఎఫ్ఐ నాయకులు విమర్శించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోకాళ్లపై కూర్చొని నిరసన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ మాట్లాడుతూ హోంశాఖ మంత్రి అనిత రాష్ట్రంలో పోలీస్ శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 12 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని ప్రకటించారన్నారు. అయితే జాబ్ క్యాలెండర్లో 1,156 కానిస్టేబుళ్లు, 378 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగుల వయస్సు పెరుగుతున్నందున ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న యువతపై అక్రమ కేసులు నమోదు చేసి నిర్బంధిస్తున్నారన్నారు. కాకినాడలో పోలీసు ఉద్యోగ అభ్యర్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేనిపక్షంలో యువత, నిరుద్యోగులతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు చైతన్య, తిరుపతి, జగదీష్, సురేంద్ర, శేఖర్, నరేంద్ర, బాపనయ్య, బాబులు, మణి, ప్రతాఫ్, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.


