● పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో
800 మంది
● ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడమే కారణమా?
నెల్లూరు(అర్బన్): ఐదో తేదీ దాటింది. అనేకచోట్ల ఇంకా ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎదురు చూపులే మిగిలాయి. నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 800 మందికి పైగా జీతాలు ఇవ్వలేదు. మెడికల్ కళాశాల పరిధిలోని పెద్దాస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్ నర్సులు, కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ఇతర సీనియర్ డాక్టర్లతో సహా సుమారు 800 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ కలిపి 8 బిల్లులను ఆగస్టు 24వ తేదీనే ట్రెజరీకి మెడికల్ కళాశాల అధికారులు పంపారు. ఏమైనా లోపాలుంటే వెంటనే ట్రెజరీ అధికారులు తెలపాలి. అయితే గతానికి భిన్నంగా షెడ్యూల్స్ పంపలేదంటూ జిల్లా ట్రెజరీ అధికారి తొలిసారిగా బిల్లులను రిటర్న్ చేశారు. దీంతో మెడికల్ కళాశాల అధికారులు సకాలంలోనే ట్రెజరీ అధికారి కోరిన విధంగా షెడ్యూల్స్ను కూడా పంపారు. అటు తర్వాత బిల్లుల్లో ఎలాంటి లోపాలు లేవంటూ కూడా పాస్ చేశారు. దీంతో ఒకటో తేదీన జీతాలు వస్తాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. అయినా ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోన్లు తీసుకున్న వారు తమ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు తమను డిఫాల్టర్లుగా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఠంచన్గా ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.
మెడికల్ కాలేజీ (ఫైల్)
ఇది ప్రభుత్వ వైఫల్యమే..
కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఒకటో తేదీన జీతాలిస్తామని నమ్మబలికారు. మంచి పీఆర్సీ ఇస్తామని, డీఏలు విడుదల చేస్తామని హామీలిచ్చి ఇప్పుడు వాటిని మరిచిపోయారు. ఉద్యోగులకు ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడం వల్లనే జీతాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరిగింది.
– నరమాల సతీష్కుమార్, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా గౌరవాధ్యక్షుడు


