ఆత్మకూరు: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


