నెల్లూరు(పొగతోట): సచివాలయాలు, ఆర్బీకేలు తదితర భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.. భవనాలు పూర్తయి ప్రారంభోత్సవాలు చేసిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంపై రెండేళ్ల నుంచి అధికారులకు తెలుపుతున్నా ఫలితం లేదని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం నిర్వహించారు. మొత్తం ఏడింటిలో 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు కోరం లేని కారణంగా వాయిదా వేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో వాదనకు దిగారు. జెడ్పీ సీఈఓ వసుమతికి ఇన్చార్జి మాత్రమే ఇచ్చారని, పూర్తి బాధ్యతలు ఇవ్వని కారణంగా జాప్యం జరిగిందని చైర్పర్సన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సీఈఓకు ఎఫ్ఏసీ ఇచ్చారు కనుక బిల్లుల చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుంటామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సమాధానమిచ్చారు. సచివాలయాలు, ఆర్బీకేల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభించామని, వాటికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని సభ్యులు పీఆర్ అధికారులను నిలదీశారు. ఈ విషయంపై సమావేశాల్లో పదే పదే చెబుతున్నా ఫలితం లేదని వాపోయారు. దీనిపై పీఆర్ అధికారులు సమాధానమిస్తూ రాష్ట్ర అధికారులకు తెలియజేశామని, ముఖ్యమైన భవనాలు పూర్తయిన తరువాత మిగిలిన వాటి విషయంపై చర్చిద్దామని చెప్పారన్నారు.
బోరు వేయడానికి అనుమతించడం లేదు
ఒకటిన్నర సంవత్సరం నుంచి బోరు వేయడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో చర్చించారు. పనులపై అధికారులను సంప్రదిస్తే ఫలితం ఉండడం లేదని కలెక్టర్కు పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పిస్తే సాయంత్రంలోపు పనులు జరుగుతున్నాయంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేసిన వ్యక్తులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. త్వరగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఆర్జీఎస్ఏ నిధులు రూ.1,952 లక్షలతో 61 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేశామన్నారు. వాటిలో 11 భవన నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించామని, నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలకు సంబంధించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు లేవనేత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
బిల్లుల చెల్లింపుల్లో ఎందుకీ జాప్యం
సమస్యలను త్వరగా పరిష్కరించండి
కోరం లేక 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా
జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ


