● 30 కుటుంబాలు టీడీపీని వీడి
వైఎస్సార్సీపీలో చేరిక
మనుబోలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు చెందులూరు శ్రీనివాసులు, గుర్రం ప్రభాకర్ల ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాల వారు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులోని తన నివాసంలో వారికి కాకాణి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో అధికార పక్షాన్ని వీడి వైఎస్సార్సీపీలో చేరడం అభినందనీయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అసలైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కూలి జనాన్ని తీసుకొచ్చి చేరికల పేరుతో డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఆవుల తుసీరామ్ యాదవ్ పాల్గొన్నారు.


