నెల్లూరు (లీగల్): ఈనెల 12న ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.నరసింహమూర్తి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు హాల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సాయంత్రం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులు లోక్ అదాలత్లో వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని స్టేషన్ల పరిధిలో లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో సుమారు 54,590 సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించామని, రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారులు ఫోరమ్ చైర్మన్ జి.రవిశంకర్, డీఆర్వో విజయకుమార్, అడిషనల్ ఎస్పీ సౌజన్య, తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, కమిషనర్ వై.నందన్, జిల్లా జైలు సూపరింటెండెంట్ సన్యాసిరావు, డీఎంహెచ్ఓ సుజాత, ఆర్టీఓ మొదాని మహమ్మద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ షమీమ్, ఎకై ్సజ్, విద్య, ఆరోగ్య, బ్యాంక్ ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ అధికారులు పాల్గొన్నారు.


