వాస్తవానికి ఈ ప్రాంతానికి చెందిన మల్లవరపు రామారావు అనే భూస్వామి తనకున్న సర్వే నంబర్ 667– 3లో 300 ఎకరాల పట్టా భూమిని వందేళ్ల క్రితమే.. బాటసారుల భోజన వసతి కోసం కేటాయించారు. తదనంతర కాలంలో ఆ భూమిని తమ గ్రామంలోని రైతులకు తలా కొంత పొలాన్ని ఇనాంగా రాసిచ్చారు. అప్పటి నుంచి రైతులు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాలక్రమేణ కొందరు రైతులు కాలం చేయడం, వారసులు కూడా ఈ భూమిని వదిలేశారు. ఈ క్రమంలో 14.16 ఎకరాలు బీడు భూమిగా మారడం, ఇతరుల అన్యాక్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, దాన్ని జగనన్న పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. అయితే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డికి పేరొస్తొందోననే దుగ్ధతో అధికార పార్టీ పెద్దలు కుట్రలకు తెరతీశారు. సీతమ్మ చలివేంద్రం పేరుతో దేవదాయశాఖ భూమిగా తెరపైకి తెచ్చి.. విజిలెన్స్ విచారణతో రోజుకొక కట్టుకథలు అల్లుతున్నారు. శతాబ్ద కాలంగా రెవెన్యూ రికార్డుల్లో కానీ, రిజిస్టర్ డాక్యుమెంట్లలో కానీ ఇది దేవదాయశాఖ భూమిగా ఎక్కడా నమోదు కాలేదు. ఈ భూమి దేవదాయశాఖదిగా చెప్పడానికి ఆ శాఖ వద్ద కనీసం చిత్తు డాక్యుమెంట్ కూడా లేదనే వాదనను స్థానికులు వినిపిస్తున్నారు. దేవదాయశాఖ భూమి అయితే.. కాలనీకి స్థలం కేటాయించినప్పుడు కూ డా ముందుకు రాని అధికారులు.. ఇప్పుడే రాద్ధాంతం చేయడం వెనుక అధికార పార్టీ నేతల కుట్రలు ఉన్నాయని కాలనీ వాసులు మండిపడుతున్నారు.


