● నేటి నుంచి జిల్లా స్థాయి
అమరావతి చాంపియన్షిప్ పోటీలు
● ఖర్చుల కింద కేవలం
రూ.50 వేలు మాత్రమే..
● ఒక్కో క్రీడాకారుడికి టిఫిన్, భోజనం, రవాణాకు రూ.140 కేటాయింపు
● పరికరాల కొనుగోలుకు
నిధులివ్వని ప్రభుత్వం
● నియోజకవర్గ స్థాయిలోనూ
నామమాత్రంగానే పోటీలు
నాణ్యమైన భోజనం అందేనా?
నెల్లూరు(టౌన్): అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీల నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది. పోటీలను ఘనంగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. జిల్లాలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీల నిర్వహణకు నామమాత్రపు నిధులు విడుదల చేసి పండగ వాతావరణంలో చేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అథ్లెటిక్స్, ఖోఖో, బాక్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, యోగా, ఆర్చరీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ తదితర క్రీడాంశాల్లో అండర్ 17, 23 విభాగాల్లో పోటీలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆయా పోటీలకు అవసరమైన కొత్త క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ఉన్న వాటిని వినియోగించుకోవాలని లేదా క్రీడాకారులే తీసుకోచ్చుకోవాలని ఉచిత సలహా అందజేశారు. దీంతో అనేకమంది ఆసక్తి చూపలేదు. తప్పని పరిస్థితుల్లో జిల్లా శాప్ అధికారులు నామమాత్రంగా నిర్వహించాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలతో పోలిస్తే ప్రస్తుత పోటీల నిర్వహణకు కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పట్లో క్రీడా పరికరాలు, భోజనం, ఇతర నిర్వహణ ఖర్చులకు నిధులు కేటాయించడంతో పోటీలు ఉత్సాహంగా సాగాయి.
మొక్కుబడిగా..
జిల్లాలో నియోజకవర్గ స్థాయి అమరావతి చాంపియన్షిప్ పోటీలు గత నెల 28 నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించారు. అయితే నిధుల కొరత కారణంగా పోటీలు నామమాత్రంగానే జరిగాయని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పోటీల నిర్వహణకు కేవలం రూ.5 వేల చొప్పున కేటాయించారు. టిఫిన్ ఖర్చులను క్రీడాకారులే భరించుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనాన్నే క్రీడాకారులకు అందించారు. పరికరాలను కూడా క్రీడాకారులే తీసుకురావాలని సూచించారు. అవసరమైతే పాఠశాలల్లో అందుబాటులో ఉన్నవాటిని వినియోగించుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో పోటీల నిర్వహణపై క్రీడాకారుల్లో ఆసక్తి తగ్గింది. గతంలో మాదిరిగా క్రీడా పండగ వాతావరణం కనిపించలేదని ఆయా వర్గాలు అంటున్నాయి.


