● డీఎస్సీలో అవకతవకలకు
బాధ్యత వహించాలి
● పరీక్షల వ్యవస్థలో పనిచేసిన
వ్యక్తికి టాప్ ర్యాంక్
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి
పొదలకూరు: డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, నైతిక విలువలుంటే విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో టౌన్హాల్ సమావేశాన్ని పొదలకూరులోని ఎమ్మార్ కల్యాణ మండపంలో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పారదర్శకతను పాతిపెట్టారని, పరీక్షల వ్యవస్థలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడాన్ని చూస్తే స్కామ్ ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని చెప్పారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. పరీక్ష నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగియని, రాజీనామా చేయాలని లోకేశ్ను డిమాండ్ చేస్తే స్పందించడంలేదని విమర్శించారు. డీఎస్సీ కన్వీనర్ను సర్కార్ ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి, ప్రశ్నపత్రాల తయారీ నుంచి నిర్వహణ బాధ్యత మొత్తాన్ని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించి, అక్రమాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా.. టీజీటీ తెలుగులో ఆరో ర్యాంక్ను సాధించడం సాధారణ విషయంకాదన్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట నిరుద్యోగుల పొట్టకొట్టారని విమర్శించారు. రూ.20 లక్షల చొప్పున బేరం కుదుర్చుకొని ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు సైతం దందాను యథేచ్ఛగా కొనసాగించారని, ఇందులో దళారుల పాత్రా ఉందని తెలిపారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ను సాధించిన ప్రతిభావంతులను పక్కనబెట్టి, పాల్గొన్న వ్యక్తులకు ఉద్యోగాలిచ్చారని వివరించారు. ఏ హామీనీ నెరవేర్చలేదని, బూటకపు వాగ్దానాలతో కాలం గడుపుతోందని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదన్నారు.
జీఓల మార్పుతో గందరగోళం
డీఎస్సీ నియామకాల్లో జీఓల మార్పుతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి విమర్శించారు. స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచుతూ.. జీఓ నంబర్లు 4, 47ను తీసుకొచ్చారని తెలిపారు. పోస్టులు భర్తీకాగానే వాటిని రద్దు చేసి జీఓ నంబర్ 56ను జారీ చేశారని మండిపడ్డారు. ఇవి సరైనవే అయితే ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు చిల్లకూరు సుధీర్రెడ్డి, గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్, దాసరి భాస్కర్గౌడ్, ఆదూరు వెంకటసుబ్బయ్య, వెంకటశేషయ్య, శంకరయ్యగౌడ్, చంద్రశేఖర్రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, కృష్ణవేణి, కోనం బ్రహ్మయ్య, సుగుణ పాల్గొన్నారు.
దుత్తలూరులో..
ఉదయగిరి: దుత్తలూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశాన్ని పార్టీ మండలాధ్యక్షుడు వాసుదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


