● బెల్ట్ షాపుల వాటాల పంపకం
వివాదంతో ఉద్రిక్తత
● పోలీసుల రంగప్రవేశంతో ఆగిన గొడవ
ఉదయగిరి: మద్యం బెల్టు షాపుల వాటాల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మద్యం దుకాణాల యజమానులు బాహాబాహీకి దిగిన వైనం ఉదయగిరిలో గురువారం జరిగింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో మద్యం వ్యాపారులు వీధి రౌడీల్లా కొట్లాటకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలను కొంతమంది సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయగిరి మండలంలో మూడు అధికారిక మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో కొన్ని షాపులకు వ్యాపారం జరుగుతుండగా, మరికొన్ని షాపులకు వ్యాపారం లేదు. మూడు షాపుల యాజమానులు ఒక ఒప్పదానికి వచ్చి ఓ షాపు యజమాని గ్రామాల్లో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసుకునే విధంగా నిర్ణయించుకున్నారు. దీని కోసం ప్రతి నెల కొంత మొత్తం మిగితా షాపులకు చెల్లించే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని, దొంగ చాటుగా బెల్ట్ వ్యాపారం చేస్తున్నారని ఎస్ఎల్వీ, ఎంఆర్ఎస్ దుకాణాల యజమానుల మధ్య వివాదం నెలకొంది. బెల్ట్ షాపుల నుంచి చెల్లింపులు సక్రమంగా ఇవ్వడం లేదనే సమస్య కూడా ఉంది. దీంతో ఈ రెండు దుకాణాల యజమానుల మధ్య వివాదం తారస్థాయికి చేరి దాడి చేసే వరకు వచ్చింది. స్థానికుల సమాచారం అందుకున్న ఎస్సై ఆళ్ల శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గొడవలో ప్రమేయం ఉన్న వారిని స్టేషన్కు తరలించారు. అయితే ఈ వ్యవవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని, ఇంత వరకు కేసు నమోదు చేయలేదని ఎస్సై మహేంద్ర తెలిపారు.
చోద్యం చూస్తున్న అధికారులు
గ్రామాల్లో బెల్ట్ దుకాణాలకు యథేచ్ఛగా మద్యం సరఫరా అవుతున్నా.. ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్ దుకాణాల వ్యవహారంపై గొడవలు జరుగుతున్నా సివిల్ పోలీసులు చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. నెల మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం పైకి బెల్ట్ దుకాణాలు లేవని చెబుతున్నా, పరోక్షంగా పబ్లిక్గా గ్రామాల్లో గొలుసు దుకాణాలు నడుస్తున్నా.. చర్యలు లేవని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహకులపై కఠన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


