విడవలూరు: పేదవాడు ఒక పూట కడుపు నింపుకోవడానికి తెల్ల రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. కనికరించని ప్రభుత్వం, అధికార యంత్రాంగం భూస్వాములకు అప్పనంగా కట్టబెడుతున్నారు. పేదలకు సొంతిల్లు ఉందని, కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, నాలుగు చక్రాల వాహనం ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. అర్హులకు అన్యాయం జరుగుతుందనేదానికి మండలంలోని గాదెలదిన్నెలో వైట్ కాలర్కు తెల్లరేషన్ కార్డును రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 3 ఎకరాలకు మించిన మాగాణి భూమి ఉంటే.. తెల్లరేషన్ కార్డు పొందేందుకు పూర్తిగా అనర్హులు. కానీ మండలంలోని గాదెలదిన్నెకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు తుమ్మల ప్రసాద్ కుటుంబానికి ఈ నిబంధనలేవీ వర్తించలేదు. అతని పేరు మీద ఏడాదికి మూడు పంటలు పండే 16 ఎకరాల మాగాణి భూమి ఉంది. సొంతిల్లు, కారు, చేపలు, రొయ్యల గుంతలు ఉన్న భూస్వామికి కార్డు జారీ చేయడం రెవెన్యూ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. సదరు కార్డులో జూలై (ప్రస్తుత నెల) రేషన్ కూడా పొందడం గమనార్హం. బాధ్యతగల జెడ్పీటీసీ తనయుడై ఉండి కూడా ఇలా తెల్ల రేషన్కార్డు పొందడం, పేద ప్రజలకు అందాల్సిన ఉచిత బియ్యం, ఇతర పథకాలను నిస్సిగ్గుగా ఆరగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


