తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 75,485 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,939 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.36 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
డీసీపల్లిలో 422
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 422 బేళ్లను బుధవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 462 బేళ్లు రాగా, 422ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 59,362.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,30,32,993.20 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.160.. సగటు ధర రూ.219.55గా నమోదైందని వెల్లడించారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.250
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 351 బేళ్లను తీసుకురాగా, 259ను విక్రయించగా, మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి చంద్రశేఖర్ మాట్లాడారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160.. సరాసరిన రూ.187.59 లభించిందని వివరించారు. 12 కంపెనీలు హాజరయ్యాయని చెప్పారు.
గిరిజన బాలికపై
లైంగిక దాడికి యత్నం
అల్లూరు: తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అల్లూరు ఎస్సై శ్రీనివాసరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని గాలిదిబ్బలుకు చెందిన బాలిక ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆడుకోసాగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో అటుగా వచ్చిన నాగులదేవిగుంటకు చెందిన యాటగిరి చాంద్బాషా బాలిక చేతిని పట్టుకోగా విడిపించుకొని పక్కనే స్నేహితురాలి ఇంట్లోకి వెళ్లింది. ఆపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో కేకలేయగా, చుట్టుపక్కల వారొచ్చి అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
సర్ డిజిటలైజేషన్ @
99.99 శాతం
నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సవరణ జాబితా (సర్)కు సంబంధించిన ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19,74,240 మంది ఓటర్లకు గానూ, ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందజేశారని వివరించారు. ఇందులో 19,74,044 ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసి 99.99 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని పేర్కొన్నారు. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో నూరు శాతం.. నెల్లూరు రూరల్లో 99.95, గూడూరులో 99.98 శాతం మేర పూర్తయిందని వెల్లడించారు.
18 వరకు వెబ్ ఆప్షన్లు
నెల్లూరు (టౌన్): డీఈఈ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆప్షన్ల నమోదుకు అవకాశాన్ని ఈ నెల 18 వరకు కల్పించామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 20 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. సీట్లు పొందిన వారు అధికారిక వెబ్సైట్ నుంచి తాత్కాలిక ప్రవేశ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ప్రభుత్వ డైట్కు ఈ నెల 24 నుంచి 29 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై పత్రాల పరిశీలనను జరిపించుకోవాలని కోరారు. అనంతరం తుది ప్రవేశ పత్రాన్ని జారీ చేయనున్నామని, డీఎల్ఎడ్ ప్రథమ సంవత్సర తరగతులు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయని వెల్లడించారు.


