● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
గూడూరు: గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం పాలూరు రాజుపాళెం గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటేశ్వర్లు (35) గూడూరులో పనులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తిప్పవరప్పాడు దాటిన తర్వాత రోడ్డు పక్కన తవ్వి ఉన్న గుంత కారణంగా బైక్ అదుపు తప్పింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అటుగా వెళ్తున్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
మృత్యుంజయుడు
గూడూరు: మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద బైక్ పడి నుజ్జునుజ్జుగా మారింది. కాగా ఆ వాహనాన్ని నడుపుతున్న ఓ యువకుడు మృత్యుంజయుడిగా నిలిచిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాపూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు గూడూరు ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చే సమయంలో మలుపు తిరుగుతున్న సమయంలో ఓ యువకుడు వేగంగా బైక్పై వస్తూ అదుపుతప్పాడు. మలుపు తిరుగుతున్న బస్సు వెనుక చక్రాల కిందకు బైక్ వెళ్లిపోయింది. అయితే యువకుడు బైక్ను వదలి వేసి పక్కకు దూకేశాడు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్తోపాటు, అటుగా వెళ్తున్న వారు యువకుడ్ని పైకి లేపారు. బస్సులు బస్టాండ్లోకి వచ్చే సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు అంటున్నారు.


