● ఐదుగురికి తీవ్రగాయాలు
చిల్లకూరు: బొగ్గు లారీ వేగంగా ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం చిల్లకూరు పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ పరిధిలో రైటార్ సత్రానికి చెందిన సుగుణ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, వెంకటరమణమ్మ చిల్లకూరులోని పొదుపు కార్యాలయానికి వెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన శ్రావణి గూడూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుని కార్యాలయానికి వచ్చింది. వీరంతా పని ముగించుకుని ఇంటికి తిరిగి ఆటోలో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి జ్యూస్ తాగి బయలుదేరారు. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు నుంచి శ్రీసిటీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో చిల్లకూరు 108 సిబ్బంది కృష్ణ, పెంచలయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వివరాలు తెలుసుకుని ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


