సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అయితే, జంట హత్యల కేసులో పిన్నెల్లిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిన సంగతి తెలిసిందే.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ..‘పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరు ఉన్నా చట్టం ముందు నిలబెడుతాం. 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.



