నెల్లూరు(దర్గామిట్ట): ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లాను మంగళవారం ఏపీ వైఎస్సార్ టీఏ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులకు కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ కరువు భత్యాలను వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సంపాదిత సెలవు బకాయిలను విడుదల చేయాలని, ఉద్యోగులు తమ అవసరాల కోసం దరఖాస్తు చేసిన పీఎఫ్ లోన్లు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఒ.శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ జాన్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


