నెల్లూరురూరల్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం కాకాణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని స్మరించుకున్నారు. ఆయన బలిదానం వల్లే 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆయన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాలేదని, భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహనీయుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ అమరజీవి అభిమానుల కోరిక మేరకు మన జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి ఆయన పేరును ప్రతినిత్యం స్మరించుకునే అవకాశాన్ని మనకు కల్పించారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను గౌరవిస్తూ, ఆయనను స్మరించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.


