● పోటాపోటీగా బలప్రదర్శన
● నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, టిడ్కో చైర్మన్ అజయ్కుమార్ మధ్య ఆధిపత్య పోరు
ఆత్మకూరు: ఆత్మకూరు జనసేన పార్టీ నేతలు ఆదివారం బాహాబాహీకి తలపడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ కొద్ది రోజులుగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. శనివారం పది వేలకుపైగా సభ్యత్వాలు పూర్తి చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాసులు స్వయంగా ఆత్మకూరుకు వచ్చి శ్రీధర్ను అభినందించారు. ఈ నేపథ్యంలో పార్టీలోని మరో వర్గంగా కొనసాగుతున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ అనుచరులు చదలవాడ హరీష్కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేములపాటి అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు బహిరంగ సభ జరుగుతున్న వేదిక వద్దకు చేరుకుని తమ అనుచరులతో బలప్రదర్శన చేస్తూ సభలో పాల్గొన్న వారిని తరిమేస్తూ కుర్చీలను తోసేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జీ గంగాధర్, ఎస్సైలు ఎస్కే జిలానీ, బీ సాయిబాబా నలిశెట్టి శ్రీధర్ వర్గీయులను బహిరంగ సభ నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. అయితే వారు అక్కడ రోడ్డుపై బైఠాయించి అజయ్కుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ సభ జరిగినంతసేపు నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు అజయ్కుమార్కు వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు.
ఆత్మకూరులో జనసేన బహిరంగ సభను అజయ్కుమార్ వర్గీయులు
నిర్వహిస్తుండగా గొడవ పడుతున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు
ఒక వైపు జనసేన బహిరంగ సభ జరుగుతుండగా ఎదురుగా
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీధర్ వర్గీయులు


