● పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ
నెల్లూరు(బారకాసు): స్వచ్ఛ సర్వేక్షణ్లో నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు కృషి చేయాలని పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ ఆదేశించారు. ఎన్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ వైఓ నందన్తో కలిసి శానిటేషన్ విభాగంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పూర్తిగా ఎంతమందికి తెలుసు? తదితర అంశాలపై శానిటరీ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. వంద శాతం డోరు టు డోర్ చెత్త సేకరణ జరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడగ్గా అందుకు సరైన జవాబు చెప్పలేకపోయారు. దీంతో నగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడం మానుకుని, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రెవెన్యూ విభాగంతో ఆర్డీ సమీక్ష నిర్వహించారు. మొండి బకాయిలున్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుని పన్నులు వసూలు అయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ రహంతు జానీ, టీపీఆర్వో వాసుబాబు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


