కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదని, పేదల గుండె చప్పుడని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పురస్కరించుకొని నెల్లూరులోని తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆవిర్భవించింది తమ పార్టీ అన్నారు. జగనన్న స్థాపించిన ఈ పార్టీ ప్రతి పేదవాడి గడపకు చేరిందని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన వెన్నంటే ఉండి పార్టీని కాపాడుకున్న ఘనత కార్యకర్తలకే దక్కుతుందని కొనియాడారు. సంక్షేమ రాజ్యాన్ని మరోసారి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంక్షించారు.
భోజన వసతికి
టెండర్ల ఆహ్వానం
నెల్లూరు(క్రైమ్): మూలాపేటలోని జైళ్ల శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే సిబ్బందికి భోజన సదుపాయాన్ని కల్పించేందుకు గానూ టెండర్లను ఆహ్వానిస్తున్నామని ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని, టెండర్ విలువ రూ.20,16,450 అన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు రూ.112ను చెల్లించి టెండర్ ఫారాన్ని ఏపీ స్టార్స్లో పొందొచ్చని చెప్పారు. పూర్తి చేసిన ఫారాలను సీల్డ్ కవర్లో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించనున్నామని, అదే రోజు మధ్యాహ్నం 2.30కు వీటిని తెరవనున్నామని వివరించారు. ధరావతుగా రూ.40,329ను చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


