‘రంగడి’ భక్తకోటికి కష్టాలు
నెల్లూరు(బృందావనం): నగరంలోని రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) నాడు దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సిఫార్సు లేఖలతో కూటమి చోటా నేతలు హల్చల్ చేశారు. రూ.50, రూ.200 టికెట్లు కొనుగోలు చేసిన వారికి చుక్కలు చూపించారు. తామ అనుయాయులు, లేఖలు ఉన్నవారిని తూర్పురాజగోపురం వద్ద ఉన్న ప్రధాన ద్వారం నుంచి దర్జాగా పంపించాలంటూ పోలీసు యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడితెచ్చారు. టికెట్లు కొనుగోలు చేసి వస్తున్న భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుండటంతో పరిస్థితిని బేరీజు వేసిన పోలీసులు వారిని నిలువరింపజేశారు. అయితే ససేమిరా అంటూ అధికార అహంకారాన్ని ప్రదర్శించారు. దీంతో పోలీసులు, సిఫార్సు లేఖలతో వచ్చిన వారి మధ్య తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తోపులాటలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న నెల్లూరు ఆర్డీఓ ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేశారు.
బాధ్యత ప్రైవేట్ వ్యక్తికి..
లేఖలతో వచ్చిన పంపేందుకు దేవస్థానంలో దుస్తుల కాంట్రాక్టర్ ఒకరికి బాధ్యతలను అప్పగించారు. అతని మాటే శాసనంగా చెల్లుబాటైంది. లేఖలు అందుకుని వారి పేర్లు పరిశీలిస్తూ 5 నుంచి 10 మంది వరకు దర్జాగా సాగనంపారు. ఈ పరిస్థితిని చూస్తున్న దేవదాయ, ధర్మదాయ శాఖ సిబ్బందితోపాటు పోలీసు అధికారులు సైతం ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు సాహసించలేదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో పాసులు, లేఖల విషయం ప్రస్తావించలేదు. టికెట్లు కొనుగోలు చేసి రంగడిని దర్శించుకోవాలన్నారు. ఇది నిజమని నమ్మిన భక్తులు మోసపోయారు.
ఏర్పాట్లు చేయడంలో విఫలం
వేలాదిమంది భక్తులు తరలివస్తారన్న విషయం తెలిసినా అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వగృహానికి కూతవేటు దూరంలో ఉన్న దేవస్థానం వద్ద, అలాగే పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహించే నెల్లూరు నగరంలో భక్తులకు ఈ పరిస్థితి ఎదురుకావడం అసహనంతోపాటు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాగే వలంటీర్లను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడం, బయట వ్యక్తులకు పెత్తనం ఇవ్వడంతో దేవదాయ శాఖ సిబ్బంది ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు.
కట్టె పొంగలి ప్రసాదంతో సరి
మున్నెన్నడూలేని విధంగా ఈ ఏడాది భక్తులకు కట్టె పొంగలి ప్రసాదంతో సరిపెట్టారు. 25 ఏళ్లుగా ముక్కోటి నాడు ఇటువంటి ప్రసాదం పంపిణీ కాలేదంటూ భక్తులు చెబుతున్నారు. గతంలో భక్తమండళ్ల సేవా నిరతిని గుర్తుచేసుకుని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహఃగా ఉన్నారు. భక్తబృందాలను ఆ శాఖ అధికారి ఒకరు అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. అ అధికారి మాటలను ప్రభుత్వ పెద్దలు శిరసావహించారని విమర్శలున్నాయి.
సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులు
ప్రధాన ద్వారం వద్ద లేఖలు తీసుకుంటూ..
మంత్రి, ఎమ్మెల్యే, నుడా చైర్మన్ సిఫార్సు లేఖలకు పెద్దపీట
కూటమి నేతల హల్చల్
పోలీస్లు, భక్తుల మధ్య తోపులాటలు
విఫలమైన దేవదాయ శాఖ
అధికారులు
‘రంగడి’ భక్తకోటికి కష్టాలు
‘రంగడి’ భక్తకోటికి కష్టాలు


