
29 మంది ఎంఈఓలకు షోకాజు నోటీసుల జారీ
నెల్లూరు (టౌన్): జిల్లాలో 29 మంది ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓలు ప్రతి రోజు ఉదయం 9 గంటల్లోపు ఫేస్ రికగ్నిషన్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే గురువారం జిల్లాలో 29 మంది సమయానికి రికగ్నిషన్ యాప్లో హాజరు నమోదు చేసుకోకపోవడం డీఈఓ ఆర్.బాలాజీరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. రెండో రోజుల్లో వివరణ పంపాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 మంది ఎంఈఓలు ఉన్నారు. వీరిలో 29 మంది సకాలంలో యాప్లో హాజరు నమోదు చేసుకోకపోవడం చూస్తే విధుల్లో వారికున్న చిత్తశుద్ధికి అద్దపడుతోంది. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులే అలసత్వం ప్రదర్శించడంపై పలువురు మండి పడుతున్నారు.
హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులకు
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరంలో రెండేళ్ల హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులు చదివేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరుతోపాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అయితే లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోపు కళాశాల పనిదినాల్లో తమ దరఖాస్తులను అందజేయాలని కోరారు. దరఖాస్తు రుసుం రూ.100 ఉంటుందన్నారు. దరఖాస్తులు, ఇతర వివరాలకోసం ఎస్పీఎస్నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్లో పరిశీలించుకోవాలన్నారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు
వ్యక్తిగతంగా హాజరుకావాలి
నెల్లూరు (టౌన్): డీఎస్సీ–2025కు సంబంధించి వివిధ కేటగిరీల పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ను అందించనున్నట్లు డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వదంతులు, దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్, క్యాండిడెట్ లాగిన్లో విడుదల చేస్తారన్నారు.
అక్రమ గ్రావెల్ రవాణాపై
మైనింగ్ ఏడీ తనిఖీ
దగదర్తి: మండలంలోని తిరువీధిపాడు గ్రామానికి చెందిన ఓ రైతు తమ పట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని మైనింగ్ ఏడీ వాణిశ్రీ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తిరువీధిపాడులో సర్వే నంబర్ 118లో స్థానిక రైతు మోపూరు భక్తవత్సలరెడ్డి చెందిన పట్టా భూమి ఉంది. తన భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఇటీవల స్థానిక పోలీసులకు, తహసీల్దార్, మైనింగ్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రావెల్ తరలింపును నిలిపివేయాలన్న ఆదేశాలిచ్చినా అక్రమార్కులు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ చేసేదేమీ లేక ఆ రైతు కలెక్టర్ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ ఏడీ గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని తనిఖీ చేసి ఎవరైనా ఈ భూమిలో గ్రావెల్ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.