
ఫైల్ఫోటో
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం.
ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.
కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు.