
సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తాం
● నెల్లూరు, ప్రకాశం డీసీహెచ్ఎస్లు
● ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాల పరిశీలన
● సమయపాలన
పాటించడం లేదని ఆగ్రహం
ఉలవపాడు: వైద్యులు, సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తామని నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్లు పరిమళ, శ్రీనివాస నాయక్ హెచ్చరించారు. ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలను గురువారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆగ్రహించారు. రికార్డులను పరిశీలించారు. వైద్యశాల పనితీరు ఎలా ఉందని స్థానికులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని వారు డీసీహెచ్ఎస్లకు తెలియజేశారు. 8 మంది వైద్యులున్నా అధిక శాతం మంది సెలవులోనే వెళ్లారని, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. సెలవులు ఒకేసారి ఇంతమందికి ఎలా ఇస్తారని అడిగారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన చాలా దారుణంగా ఉందన్నారు.
రాత్రివేళ సిబ్బంది కనిపించడం లేదు
రాత్రివేళ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది వార్డులో ఉండకుండా వెళ్లి రూమ్లో పడుకుంటున్నారని.. వారిని లేపే సరికి దాదాపు 15 నిమిషాలు పడుతుందని రోగులు తెలియజేశారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో వైద్యాధికారులుగా శోభారాణి, సతీష్లు ఉన్నప్పుడు వైద్యశాల బాగుంది. తర్వాత నుంచి పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు స్థానికులు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్ట్ మెటర్నటీ లీవ్ పెట్టి వెళ్లారు.. కానీ కందుకూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మాత్రం పనిచేస్తున్నట్లు తెలిపారు. వీటిపై అధికారులు డాక్టర్లను ప్రశ్నించగా వారు మౌనం వహించారు. దీంతో డీసీహెచ్ఎస్లు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరిగితే సహించేది లేదని సస్పెండ్ చేస్తామన్నారు. వారంరోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరు కోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు హరీష్, చిన్నపిల్లల వైద్యనిపుణులు ప్రదీప్కుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.