
ప్రాణం చిన్నది.. ప్రమాదం పెద్దది
అవగాహన పెంచాలి
దోమలు నివారణ జరగాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలి. వాటి ద్వారా వచ్చే డెంగీ లాంటి జబ్బుల్లో కొన్ని రకాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చికిత్సకే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు ఇంట్లో, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా మెస్లు ఏర్పాటు చేయించుకోవాలి.
– డాక్టర్ ఎంవీ రమణయ్య,
ప్రజారోగ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు
చర్యలు తీసుకున్నాం
జిల్లాలో దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అన్ని హాస్టళ్లలో మలాథియాన్ స్ప్రే చేశాం. నీటి గుంతల్లో దోమ లార్వాలను తినే గంబూసియా చేపలను వదిలిపెడుతున్నాం. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు ప్రజల వద్దకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా మలేరియా, డెంగీ కేసులు నమోదైనట్టు తెలిస్నే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం.
– హుస్సేనమ్మ,
జిల్లా మలేరియా నివారణాధికారిణి
నెల్లూరు(అర్బన్): డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా.. ఇవి రావడానికి ప్రధాన కారణం దోమ కాటు. వర్షాకాలంలో వీటి బెడద విపరీతంగా ఉంటూ సమాజాన్ని వణికిస్తాయి. లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో నగదు ఖర్చయి ఆర్థికంగా నష్టపోతున్న వారు కూడా ఉన్నారు. మరికొందరికి డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. బుధవారం దోమల నివారణ దినం సందర్భంగా జిల్లాలో కూడా వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ సదస్సులు నిర్వహించనున్నారు. మలేరియా నిర్మూలన కోసం పోరాటాన్ని వేగవంతం చేయడం, మరింత సమానమైన ప్రపంచం కోసం అనే థీమ్ను ఈ ఏడాది ప్రకటించారు.
విజృంభిస్తున్న వ్యాధులు
జిల్లాలో దోమలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు ప్రమాదకరమైన జపనీస్ ఎన్సెఫలైటిస్, పసుపు జ్వరం, జికా వైరస్లు అప్పుడప్పుడూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ జబ్బులకు గురైన పలువురు చికిత్సకు స్పందించక చనిపోతున్నారు. కొద్దిరోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. వర్షపునీరు ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేరింది. నెల్లూరు నగరంలో ఖాళీ ప్లాట్లు, మురుగు కాలువలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో జ్వరపీడితుల సంఖ్య పెరిగింది.
అలా వస్తేనే..
జిల్లాలో 52 పీహెచ్సీలు, 10 సీహెచ్సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, నగరంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 450 వరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు నడుస్తున్నాయి. అన్నిచోట్లా రోగులు పెరుగుతున్నారు. రామచంద్రారెడ్డి, జయభారత్, నారాయణ, మెడికవర్ ఇలా పలు హాస్పిటళ్లలో డెంగీ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్లో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. ప్రభుత్వాస్పత్రిలో చేసే ఎలీసా టెస్ట్ల్లో పాజిటివ్ వస్తేనే డెంగీ లాంటి జబ్బులను అంగీకరిస్తున్నారు. దీంతో వైద్యశాఖలో డెంగీ, మలేరియా కేసులు లేనట్టు.. ఒకటో రెండో వచ్చినట్టు కాకి లెక్కలు రాస్తున్నారు. గత సంవత్సరంలో డెంగీ 130, మలేరియా 6, చికున్గున్యా 2 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జూలై నెల వరకు డెంగీ 19, మలేరియా 3, చికున్గున్యా 2 కేసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన చర్యలు
ఇంట్లో, ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, పూలకుండీలు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు ఉంటే పారబోయాలి. మురికి కూపాలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. దోమతెరలు వాడాలి. దోమల నియంత్రణకు స్ప్రేలు వినియోగించాలి. అలాగే తులసి, వేప లాంటి మొక్కలను పెంచడం ద్వారా కొంతమేరకు దోమలను తగ్గించుకోవచ్చు.
సమాజాన్ని వణికిస్తున్న దోమలు
ఒక్కోదఫా ప్రాణాంతకంగా మారుతున్న జబ్బులు
అవగాహన, జాగ్రత్తలతోనే నివారణ
నేడు ప్రపంచ దోమల నివారణ దినం
జిల్లాలో అవగాహన కార్యక్రమాలు