రేపటి నుంచి ధ్యాన, యోగా ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ధ్యాన, యోగా ఉచిత శిక్షణ

Apr 30 2025 12:14 AM | Updated on Apr 30 2025 12:14 AM

రేపటి నుంచి ధ్యాన, యోగా ఉచిత శిక్షణ

రేపటి నుంచి ధ్యాన, యోగా ఉచిత శిక్షణ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి వేసవి ధ్యాన, యోగా ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు యోగా శిక్షకులు ముత్యాల రవీంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లోని స్వతంత్య్ర పార్కులో జరిగే ఈ శిక్షణా శిబిరంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9440738171, 6301271792 నంబర్లలో సంప్రదించాలన్నారు.

పరీక్షలకు

28 మంది హాజరు

వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ) అనుబంధ కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 28 విద్యార్థులు హాజరయ్యారని వీఎస్‌యూ ఎగ్జామ్స్‌ నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి తెలిపారు. మొత్తం 31 మందికి ముగ్గురు గైర్హాజరయ్యారని తెలిపారు.

రేపు జిల్లా స్థాయి

చెస్‌ ఎంపికలు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా స్థాయి అండర్‌–9 ఓపెన్‌, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు, ఎంపికలను గురువారం నగరంలోని పొగతోటలోని రాయ్‌ చెస్‌ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు 1–1–2016 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 96033 45326 నంబరులో సంప్రదించాలని కోరారు.

ఉపాధి సిబ్బందిపై

క్రిమినల్‌ కేసులు

ఉదయగిరి రూరల్‌: మండలంలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడి నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగులు, సిబ్బందిపై కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డ్వామా పీడీ బి.గంగాభవానీ ఆదేశాలు జారీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో జరిగిన ఉపాధి పనులపై 17వ విడత సామాజిక తనిఖీ గత నెలలో చేపట్టారు. తనిఖీల్లో ఉద్యోగులు, సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఏపీఓ, ఈసీ, టీఏలతోపాటు ఎఫ్‌ఏలు మెత్తం కలిపి 21 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు దుర్వినియోగం చేసిన నిధులు రూ.47,62,832లు రికవరీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని ఎంపీడీఓ అప్పాజీ తెలిపారు.

నూరు శాతం

ఫలితాలకు కృషి

సంగం: గురుకుల పాఠశాల విద్యార్థినులు, వసతి గృహ విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ కల్పించడం ద్వారా నూరు శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు డీసీఓ టీ పద్మజ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కె.శోభారాణి తెలిపారు. సంగం గురుకుల కళాశాలను మంగళవారం వారు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్‌, 10వ తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థినులకు సంగం గురుకుల పాఠశాలలో అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి ఈ క్యాంప్‌కు హాజరైన విద్యార్థినులతో డీసీఓ టీ పద్మజ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కె శోభారాణి మాట్లాడారు. వారిలో ధైర్యం నింపి ప్రోత్సహించారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకుంటే ఉన్నత శిఖరాలను సులభంగా చేరుకోవచ్చునని, వారి అనుభవాలను విద్యార్థినులతో పంచుకొని వారిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.సుమతమ్మ ఉన్నారు.

కండలేరులో

45.318 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారానికి 45.318 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 220, పిన్నేరు కాలువకు 100, లోలెవల్‌ కాలువకు 50, హైలెవల్‌ కాలువకు 30, మొదటి బ్రాంచ్‌ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement