
ఆస్తి కోసం.. మానవత్వం లేకుండా..
● కడుపున పుట్టిన వారు వేధిస్తున్నారు
● వృద్ధుల కన్నీటి వేదన
● పోలీసు అధికారులకు అందిన ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): కొందరు ఆస్తి కోసం కన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసి ఆస్తి రాయించుకుని వారిని దూరం పెడుతున్నారు. పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇలాంటి వినతులు అధికంగా అందుతున్నాయి. కడుపున పుట్టిన వారు ఎలా వేధిస్తున్నారో వృద్ధులు అధికారులకు విన్నవించి కన్నీటి పర్యంతమవుతున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. డీటీసీ, మహిళా పోలీస్స్టేషన్ల డీఎస్పీలు గిరిధర్, చెంచు రామారావులు ఫిర్యాదులు స్వీకరించి ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో వాటిని పరిష్కరించాలని సూచించారు. మొత్తం 115 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● నాకు ముగ్గురు కుమార్తెలు. నా భర్త జీవించి ఉన్న సమయంలో ఆస్తిని సమంగా పంచారు. ప్రస్తుతం నా పేరుపై ఉన్న ఇంటిని వారు ఆక్రమించారు. విధిలేని పరిస్థితుల్లో నా మేనల్లుడు వద్ద ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు జాకీర్హుస్సేన్నగర్కు చెందిన సుగుణమ్మ కోరారు.
● నా పేరుపైనున్న ఇంటిని నాకు తెలియకుండానే కొడుకు, కోడలు వారి పేరు మీదకు మార్చుకున్నారు. నా బాగోగులు పట్టించుకోవడం లేదు. జీవనం కష్టతరంగా మారింది. తగిన చర్యలు తీసుకోవాలని వింజమూరుకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు.
● నా పేరుపై ఉన్న ఆస్తిని కొడుకు, కోడలు తమపేరుపై రాయించుకుని ఇంటి నుంచి తరిమేశారు. తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంటున్నాను. న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది.
పాపం వృద్ధులు