
పచ్చదండు బరితెగింపు
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని కాటేపల్లి గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూములపై పచ్చదండు కన్ను పడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేశారు. గ్రామ అవసరాల కోసం ఉపయోగించే మందబయలు, పశువులు పోరంబోకు భూమిని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమ అనుచరులతో కలిసి కబ్జా చేస్తున్న విషయం తెలియడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు చర్యలు తీసుకునేందుకు ముఖం చాటేశారనే ప్రచారం జరుగుతోంది. కాటేపల్లి రెవెన్యూ పరిధిలోని 277, 278, 282, 288 సర్వే నంబర్లలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అఽధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ కుటుంబ సభ్యులు ఈ నెల 9వ తేదీన కొంత భూమి ఆక్రమించి యంత్రాలతో చదును చేశారు. వింజమూరు–గొట్టిగుండాల మార్గంలో తారు రోడ్డుకు అతి సమీపంలో ఉన్న భూమి కావడంతో ఎకరం రూ.లక్షల్లో ఉంది. దీంతో ఈ భూమిపై కన్నేసిన నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమణకు స్కెచ్ వేశారు. ఈ విషయం అధికార పార్టీలో ఇతరులకు తెలిసి గ్రామ అవసరాల కోసం ఉపయోగించే ఈ భూమి కబ్జా చేస్తే ఇబ్బందిగా ఉంటుందని అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా మౌనంగా ఉన్న సదరు నేత తాజాగా తన ప్రయత్నాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 9న కొంత భూమి ఆక్రమించారు. మళ్లీ 13వ తేదీ రాత్రి మరికొంత భూమి ఆక్రమించారు. ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్లపై 145 సెక్షన్ అమల్లో ఉండడం గమనార్హం. మంగళవారం గ్రామ సర్పంచ్ మరి కొంత మంది గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి తహసీల్దార్ హామీద్కు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందించకపోవడంతో కార్యాలయం బయట కొద్ది సేపు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా
వృక్ష సంపద తొలగించి,
యంత్రాలతో చదును
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

పచ్చదండు బరితెగింపు