టీ20 వరల్డ్‌కప్‌.. వారికి టికెట్లు 'ఫ్రీ' | Womens T20 WC 2024: Ticket Prices Revealed | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌.. వారికి టికెట్లు 'ఫ్రీ'

Sep 11 2024 8:25 PM | Updated on Sep 11 2024 8:32 PM

Womens T20 WC 2024: Ticket Prices Revealed

యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్‌ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్‌ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.

కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్‌ దశకు చేరుకుంటాయి.

గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్‌ మ్యాచ్‌లు దుబాయ్‌, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 20న దుబాయ్‌లో జరుగనుంది. 

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. భారత్‌ అక్టోబర్‌ 4న తమ తొలి మ్యాచ్‌ (న్యూజిలాండ్‌) ఆడనుంది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరుగనుంది.

చదవండి: టీ20 వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement